RBI New Rules: డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరుగుతున్నా, సైబర్ మోసాలు కూడా అంతే వేగంగా పెరిగిపోతున్నాయి. ఈ సమస్యను గుర్తించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రజల డబ్బును కాపాడేందుకు కొన్ని కీలక నిబంధనలు ప్రతిపాదించింది. ఇవి ఆన్లైన్ దొంగల ఆటలకు పూర్తి అడ్డుకట్ట వేస్తాయి.

ఇప్పుడు మీ ఫోన్లోనే ఒక పవర్ఫుల్ ఆయుధం వచ్చింది – కిల్ స్విచ్. ఖాతా హ్యాక్ అయినట్లు లేదా అనుమానాస్పద లావాదేవీలు కనిపించిన వెంటనే ఒక్క క్లిక్తో మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, ఐవీఆర్ అన్నీ తక్షణం నిలిపివేయవచ్చు. బ్యాంకు ధృవీకరణ పూర్తి చేసే వరకు ఎలాంటి డిజిటల్ ట్రాన్సాక్షన్ జరగదు. ఇది నిజంగా మీ ఖాతాపై పూర్తి నియంత్రణ ఇస్తుంది.
రూ.10,000 కంటే ఎక్కువ మొత్తంలో డబ్బు పంపేటప్పుడు కొత్త వన్ అవర్ వెయిటింగ్ రూల్ అమలవుతుంది. వ్యక్తులు లేదా చిన్న వ్యాపారాలు ఇలాంటి బదిలీలు చేస్తే డబ్బు వెంటనే అవతలి వారికి చేరదు. ఒక గంట పాటు గ్యాప్ ఉంటుంది. ఈ సమయంలో మోసం గుర్తిస్తే లావాదేవీని సులభంగా ఆపేయవచ్చు. ఇది ఫోన్పే, గూగుల్ పే, నెట్ బ్యాంకింగ్ అన్నింటికీ వర్తిస్తుంది.
గణాంకాల ప్రకారం దేశంలో జరుగుతున్న డిజిటల్ మోసాల్లో 98.5 శాతం ఈ రూ.10,000 పైబడిన లావాదేవీల వల్లే జరుగుతున్నాయి. అందుకే RBI ఈ మొత్తాన్ని ప్రామాణికంగా తీసుకుని కఠిన చర్యలు చేపట్టింది.
వృద్ధులు, దివ్యాంగులను లక్ష్యం చేసుకుని జరిగే మోసాలను అరికట్టడానికి మరో ముఖ్యమైన నిబంధన వచ్చింది. రూ.50,000 కంటే ఎక్కువ బదిలీలకు అదనపు ధృవీకరణ తప్పనిసరి. వారు ముందుగా ఎంచుకున్న నమ్మకస్థుడైన వ్యక్తి అనుమతి తీసుకోవాలి. ఇది ఫోన్ కాల్ మోసాల నుంచి పూర్తి రక్షణ ఇస్తుంది.
అలాగే, మ్యూల్ అకౌంట్లు అని పిలువబడే సరైన వివరాలు లేని ఖాతాలపై కట్టుదిట్టం. సంవత్సరానికి రూ.25 లక్షల కంటే ఎక్కువ జమ కాకుండా పరిమితి విధించనున్నారు. ఎక్కువ లావాదేవీలు చేయాలంటే వ్యాపార ప్రొఫైల్, ఆదాయ వనరుల ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇది మనీ లాండరింగ్ను నిరోధిస్తుంది.
గత దశాబ్దంలో డిజిటల్ చెల్లింపులు 53 శాతం పెరిగాయి. కానీ సైబర్ ఫ్రాడ్ కేసులు 2021లో 2.6 లక్షల నుంచి 2025 నాటికి 28 లక్షలకు చేరవచ్చని అంచనా. మోసాల వల్ల నష్టం కూడా రూ.551 కోట్ల నుంచి రూ.22,931 కోట్లకు పెరిగింది. ఈ నేపథ్యంలో RBI ఈ నిబంధనలు సామాన్యుల సొమ్ముకు బలమైన కవచంగా నిలుస్తాయి.
ఈ ప్రతిపాదనలపై మే 8 వరకు ప్రజలు తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చు.
డిస్క్లైమర్: ఈ వ్యాసం సమాచారం కోసం మాత్రమే. ఏ ఆర్థిక నిర్ణయాలు తీసుకునేముందు బ్యాంకు అధికారులు లేదా ఆర్థిక నిపుణుల సలహా తీసుకోండి.