AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఎన్నికల వాతావరణం ఏర్పడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా మాట్లాడి కీలక నిర్ణయం వెల్లడించారు. మరో ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

2021లో ఎన్నికైన ప్రస్తుత పాలకవర్గాల గడువు 2026 మార్చి-ఏప్రిల్లో ముగియనుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికలకు ముందే సన్నాహాలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కూటమి అభ్యర్థులు భారీ విజయం సాధించాలంటే మంత్రులు పూర్తి బాధ్యత తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.
క్షేత్రస్థాయిలో సీట్ల సర్దుబాటు, పార్టీల మధ్య సమన్వయం తక్షణం చేపట్టాలని ఆదేశించారు. ఏ ఎన్నిక జరిగినా కూటమి జెండా ఎగరడమే లక్ష్యం అని నిర్దేశించారు. ఇప్పటికే రాష్ట్రాన్ని సరైన దారిలో నడిపిస్తున్నామని, 2026-27 ఆర్థిక సంవత్సరం అభివృద్ధికి మైలురాయిగా మారాలని ఆకాంక్షించారు.
మంత్రుల పనితీరును మరింత పారదర్శకంగా చేయడానికి కొత్త నిర్ణయం తీసుకున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 2న కాన్ఫిడెన్షియల్ రిపోర్టులు సిద్ధం చేస్తామని ప్రకటించారు. కేపీఐ లక్ష్యాలు, దస్త్రాల పరిష్కారం, కేంద్ర నిధులు రాబట్టడం వంటి అంశాలపై ఈ నివేదికలు ఉంటాయి.
మంత్రులు కేవలం కార్యాలయాలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయి పర్యటనలు పెంచాలని సూచించారు. ప్రభుత్వ సాధించిన మంచి పనులను ప్రజలకు చేర్చడంలో సోషల్ మీడియాను ఎక్కువగా వాడాలని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో వేగంగా ప్రచారం చేయకపోతే ఫలితాలు దక్కవని మంత్రి లోకేశ్ కూడా గుర్తు చేశారు.